జూ పార్కులో ముంపునకు చెక్.. GWMC చర్యలు

కలం, హనుమకొండ: హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్న వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) చర్యలు ప్రారంభించింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న శుక్రవారం జిల్లా అటవీ శాఖాధికారి ముకుందరెడ్డితో కలిసి జూ పార్కును సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. పార్కులో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, డ్రైనేజీ నాలాల పరిస్థితిని పరిశీలించిన కమిషనర్, సమస్యకు గల కారణాలపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలాల విస్తరణ, డీ-సిల్టింగ్, నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకుల తొలగింపు వంటి చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. జూ పార్కులో వర్షపు నీటి నిల్వ సమస్యను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, దీర్ఘకాలిక దృష్టితో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి శాశ్వత పరిష్కారం అమలు చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో సందర్శకులకు, జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజు కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి, బల్దియా డీఈలు, ఏఈలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>