కలం, మహబూబ్నగర్ బ్యూరో : విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) తెలిపారు. బీఈడీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన మహబూబ్నగర్కు చెందిన విద్యార్థులను ఆయన అభినందించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సోషల్ విభాగంలో 150 మార్కులకు 122.58 మార్కులు సాధించి రాష్ట్రంలో 3వ ర్యాంక్ పొందిన నీరటి ఉదయ్ కుమార్ రెడ్డి, గణిత విభాగంలో 150 మార్కులకు 119 మార్కులు సాధించి రాష్ట్రంలో 9వ ర్యాంక్ సాధించిన మహ్మద్ ఒమర్ ముజాహిద్లను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ ఫరూక్ హుస్సేన్తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

