కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల (Jagitial) జిల్లాలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ (ACB) అధికారులకు చిక్కింది. కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) మొహినుద్దీన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక బాధితుడి నుంచి ఆయన రూ. 80,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం కొడిమ్యాల అటవీశాఖ కార్యాలయంపై ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది. బాధితుడి నుండి ఎఫ్ఆర్ఓ మొహినుద్దీన్ రూ. 80 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆకస్మిక దాడితో అటవీశాఖ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం అధికారులు ఎఫ్ఆర్ఓను విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ మొహినుద్దీన్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ బాధితుడికి సంబంధించిన పని పూర్తి చేయడానికి రూ. 80 వేల లంచం ఆశించారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో, డీఎస్పీ విజయ్ కుమార్ పక్కా ప్లాన్తో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

