కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) మండల పరిధిలోని అడవి వెంకటాపురం (Adavivenkatapuram) గ్రామంలో గురువారం భక్తిశ్రద్ధల మధ్య బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ఆయన గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతలు, కుల దేవతలు గ్రామ ప్రజలందరినీ కాపాడుతూ సుఖ శాంతులు, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో కొనసాగాలని సూచించారు. అలాగే ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి వర్గానికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వివరించారు.
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామంలోని శివ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ గుట్ట పైన వెలసిన స్వయంభూ వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు వెంకటాపురం శ్రీనివాస్ యాదవ్, గ్రామ సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ గోపాల్, సుధాకర్ రెడ్డి, మన్యంకొండ దేవస్థానం కమిటీ సభ్యులు అలివేల, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

