కలం, వరంగల్ బ్యూరో : పరకాల పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy) తెలిపారు. రాజుపేట సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ATC) ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన (Revuri Prakash Reddy) వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఎమ్మెల్యే పరకాల పట్టణంలో నిర్మించనున్న ఏటీసీ కోసం భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరకాల యువతకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలు పెంచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఏటీసీ ఏర్పాటు ద్వారా పరకాల పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందని, ఇది ప్రాంతానికి నైపుణ్య కేంద్రంగా మారుతుందని ఆయన తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పరకాల పట్టణం విద్యా, ఉపాధి రంగాల్లో కొత్త దిశగా ముందుకు సాగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

