కలం, నిర్మల్ : అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) అన్నారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
ముధోల్ నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, రెండో విడతలో మరో 2,500 ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇల్లు నిర్మించుకునేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.

