కలం, జనగామ : జనగామ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar) హామీ ఇచ్చారు. గురువారం జనగామ (Jangaon) మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్రగొల్ల పహాడ్, అడవి కేశవపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) ధాన్యం సేకరణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే రైతులందరూ ఐకేపీ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్న వడ్లకు బోనస్ తప్పకుండా అందుతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ధాన్యం అమ్మకాల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అవసరమైతే జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ధాన్యం అమ్మకాల డబ్బులు రైతుల ఖాతాల్లో ఆలస్యం కాకుండా జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

