కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ పట్టణం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Komati Reddy Prateek Govt School)లో అడ్మిషన్ల సందడి నెలకొంది. ఈ ఏడాది ప్రవేశాల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టడంతో పాఠశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే, అందుబాటులో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు భారీగా రావడంతో స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేసింది. స్కూల్లో కేవలం 400 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 4,000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక పాఠశాల యాజమాన్యం ఈ ఉదయం స్కూల్ గేటుపై ‘Admissions Closed’ అంటూ స్టికర్ అతికించింది. ఇది చూసిన వందలాది మంది తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ పిల్లలకు సీటు దక్కుతుందన్న ఆశతో వచ్చిన వారు వెనుతిరగాల్సి రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాఠశాలలో (Prateek Govt School) ఉన్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, సౌకర్యాల దృష్ట్యా కేవలం నల్లగొండ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ, కార్పొరేట్ స్థాయిలో పోటీ నెలకొనడం విశేషం. ఈ సందడిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.రామకృష్ణ స్పందిస్తూ.. “అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. అందుబాటులో ఉన్న సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల ప్రక్రియను ముగించాల్సి వచ్చింది. అడ్మిషన్ల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తున్నాం. ఇకపై కొత్తగా అడ్మిషన్లు తీసుకోవడం సాధ్యం కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్కూల్ వద్ద అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రుల రద్దీ కొనసాగుతుండటంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
Read Also: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
Follow Us On : WhatsApp

