కలం, కరీంనగర్ బ్యూరో: పట్టణంలోని సిటీ సెంటర్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చెక్కులను పంపిణీ చేశారు. 461 మంది లబ్ధిదారులకు రూ.4,61,53,473 చెక్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చాయన్నారు. పథకాల పేర్లు మార్చినా పర్లేదు.. కానీ పేదలకు మేలు చేసే పథకాలను నిలిపివేయడం సరికాదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తోపాటు తులం బంగారం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ హయాంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్లు అందించారని గుర్తుచేశారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.
అలాగే హుజూరాబాద్లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, జీవన విధానం దెబ్బతింటుందని అన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు ప్రజలతో కలిసి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.

