కలం, వెబ్ డెస్క్ : జీవన్ రెడ్డి (Jeevan Reddy).. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా మారుమోగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం లభించలేదు. మరోపక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ లో చేరడంతో జీవన్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ తన వర్గానికి తగిన టికెట్లు లభించలేదని పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిని బలపరుస్తూ కాంగ్రెస్ ను వీడుతానని ప్రకటించిన ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరాలంటూ కేటీఆర్, హరీశ్ రావు మంతనాలు జరపడంతో జీవన్ రెడ్డి గులాబీ (BRS – Jeevan Reddy) తీర్థం పుచ్చుకుంటానని ప్రకటించారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరడంతోనే ఆయనకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అయితే, జీవన్ రెడ్డి రాకతో గులాబీ పార్టీ బలపడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం నేపథ్యంలో అదే పార్టీకి దశాబ్ధాలుగా సేవలందించిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయింది.
జీవన్ రెడ్డి ‘కారు’ ఎక్కడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే తనకు ‘తెలంగాణ గురించి ఎందుకు’? అని ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, సమైఖ్య వాది అంటూ కవిత తీవ్ర విమర్శలు చేశారు. జీవన్ రెడ్డికి తెలంగాణపై ఉన్న భావనను కవిత వ్యాఖ్యలు బయట పెట్టాయి. జగిత్యాలలో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి చేరికతో ఆ జిల్లా వరకే గులాబీ పార్టీకి కాస్తో కూస్తో బలం చేరే అవకాశం ఉంది. కాకపోతే, తెలంగాణ రాష్ట్రమే పార్టీ అస్తిత్వంగా ఏర్పడిన బీఆర్ఎస్ సమైఖ్య వాదులను చేర్చుకోవడం ఆ పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: ఇసుక మాఫియాపై కరీంనగర్ పోలీసులు ఉక్కుపాదం
Follow Us On: Instagram

