కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి (Singareni) సంస్థను ‘బంగారు బాతులా’ వాడుకుంటూ దోచుకుంటున్నాయని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తీవ్ర విమర్శలు చేశారు. సంస్థ మనుగడను బలోపేతం చేయాల్సిన దిశగా చర్యలు తీసుకోకుండా, మూసివేత దశకు నెట్టేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రుద్రంపూర్లోని ఆర్సీఓఏ క్లబ్లో రెండు రోజుల పాటు జరిగిన వర్కర్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా సోమవారం కొత్తగూడెంలో (Kothagudem) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల అహర్నిశల శ్రమతో నడుస్తున్న సింగరేణిలో వారిని కట్టుబానిసలుగా చూడటం యాజమాన్యానికి, ప్రభుత్వాలకు తగదని హెచ్చరించారు. సంస్థ నష్టాలలో నడుస్తోందని చెబుతున్న మాటలలో వాస్తవాలు వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 12 ఏళ్ల స్వరాష్ట్ర పాలనలో సింగరేణికి వచ్చిన ఆదాయం, లాభాలు, వ్యయంపై యాజమాన్యం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
ఆధునిక యంత్రాల సాకుతో కార్మికులను తగ్గించి సంస్థను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని కూనంనేని (MLA Kunamneni) స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు కార్మిక నేతలు కొమరయ్య, శేషగిరిరావు, విఠల్ రావుల పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మారుపేర్ల సమస్య పరిష్కారం, సొంతింటి నిర్మాణానికి రుణ సదుపాయం, డిపెండెంట్ ఉద్యోగాలు, డిపార్ట్మెంటల్ పోస్టుల భర్తీ, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం వంటి 30 ప్రధాన డిమాండ్ల సాధన కోసం సోమవారం యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందజేస్తున్నట్లు ప్రకటించారు.
యాజమాన్యం తక్షణమే స్పందించి ఈ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే, గత ఆర్టీసీ సమ్మెను మించిన స్థాయిలో సింగరేణి వ్యాప్తంగా ఉధృతమైన సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు మిర్యాల రంగయ్య, కె. సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మద్ది ఎల్లయ్య, వై.వి. రావు తదితరులు పాల్గొన్నారు.
Read Also: సిలికాన్ వ్యాలీ హైదరాబాద్ తో పోటీ పడుతోంది : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

