కలం, మునుగోడు బ్యూరో: విద్యా, వైద్యం విషయంలో ప్రజాప్రభుత్వం సమూల మార్పులను తీసుకొస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) తెలిపారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేశారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థినీ విద్యార్థులను సన్మానించి రూ.24,50,000 చెక్కులతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మాట్లాడుతూ.. విద్యార్థులను మొబైల్స్కు దూరంగా ఉంచాలని, డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్కు ఆకర్షితులు కాకుండా అనునిత్యం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ చెడు మార్గం వైపు వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందన్నారు. మనకోసం మనం బ్రతకడంలో గొప్పేం లేదని, మనకోసం మనం బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న వారి కోసం బ్రతకడమే గొప్పతనం అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వారి కోసం ఎంతో కొంత సహాయపడాలని కోరారు. విద్యా, వైద్యం సమాజంలో రెండు కళ్ల లాంటివని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆ విషయాల కోసం సహాయం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో 10 మందికి సహాయం చేయాలని కోరారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ అవసరమైతే బంగారం అమ్మి కూడా చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: అజారుద్దీన్కు లైన్ క్లియర్ ?
Follow Us On: Instagram

