కలం, నిర్మల్ : సారంగాపూర్ (Sarangapur) మండల కేంద్రంలో అక్రమ సంబంధం అనుమానంతో వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లస్మవ్వకు మునిమాన్కల కాశన్నతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన లస్మవ్వ కుమారుడు శివరాత్రి ధర్మరాజు కాశన్నను హత్య చేయాలని పథకం రచించాడు.
ఈ నెల 4వ తేదీ రాత్రి కాశన్న మెడికల్ షాపు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, ధర్మరాజు తన మిత్రులు షేక్ అహ్మద్, షేక్ ఆసిఫ్, రాహుల్ రెడ్డి, శేఖర్లతో కలిసి కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో కాశన్న తమ్ముడు అక్కడికి రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కాశన్నను కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సారంగాపూర్ పోలీసులు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

