భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే: ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal), కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ లో విద్యా విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. వారోత్సవాలలో భాగంగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను, జిల్లా విద్యాశాఖ సాధించిన ప్రగతి గురించి డీ.ఈ.ఓ అశోక్ ముందుగా నివేదిక రూపంలో తెలియజేశారు.

ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. భావి భారత పౌరులైన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులదేనని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవం, గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. 2047 వరకు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని సాకారం చేసేవిధంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ఏ లక్ష్య సాధనకైనా చదువు ఎంతో తోడ్పాటును అందిస్తుందని, విద్యతో కూడి ఉన్న జీవితం ఉన్నతంగా ఉంటుందని అన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న ఫలితంగా ప్రైవేట్, కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తున్నాయని, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

అయితే విద్యార్థులు కేవలం మార్కుల సాధనకే పరిమితం కాకుండా, నాణ్యమైన విద్యను ఆర్జించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో మెలుగుతూ, నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగల్గుతామని ఉద్బోధించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, మీకు ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలని, ఈ విషయంలో ఎవరు ఏం అనుకుంటారో అనే సంశయాలు, మొహమాటానికి లోను కాకూడదని విద్యార్థులకు సూచించారు.

ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మల్చుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు. బలహీనతలను అధిగమిస్తూ, స్పష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుందని విద్యార్థులకు మార్గోపదేశం చేశారు.

ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవం అని వెల్లడించిన కలెక్టర్, విద్యార్థులు భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తమ గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. అప్పుడే గురువు అనే స్థానానికి మరింత గౌరవం, వన్నె లభిస్తూ సార్ధకత చేకూరుతుందని అన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్షను చూపకుండా వారిని ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత స్థానాలలో రాణించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ, మెరుగైన విద్యా బోధనకై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ బడులలో సీ.ఎం బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) పథకాన్ని అమలు చేయనుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలు, బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహూకరించారు. బాల సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో బీ.సీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఎం.ఈ.ఓలు, హెచ్.ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>