కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా రోడ్ల నిర్మాణానికి రూ.5.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) బుధవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం లక్ష్యంగా ఈ నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు.
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామం నుంచి కాల్వ వరకు రూ.1.70 కోట్లు, సారంగాపూర్ మండలం ఆలూరు రోడ్డు నుంచి కాల్వ వరకు రూ.2.20 కోట్లు, నర్సాపూర్ (జి) మండలం కదిలి గ్రామం నుంచి కుస్లీ రోడ్డు వరకు రూ.50 లక్షలు, సారంగాపూర్ మండల కేంద్రం నుంచి సేవానగర్ తండా వరకు రూ.75 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరం చేయడంతో పాటు, నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామం అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

