కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ (Mirzapur)లో బుధవారం రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. ఒక లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన లారీ ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో వరుసగా వాహనాలన్నీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఒక బోలెరో, ఆల్టో కారు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లారీ ఢీకొనడంతో బోలెరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు కారులోనే సజీవ దహనమయ్యారు. అలాగే ఆల్టో కారులో ప్రయాణిస్తున్న వారు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి గురైన వాహనాలు బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

