కలం, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు బైపాస్ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Miryalguda Accident) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి రెండు బైక్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మెగావత్ మాంగ్త్, ధనవత్ భాస్కర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో జరిగింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు నార్కట్పల్లి – అద్దంకి హైవేపై రాస్తారోకోకు దిగారు. నాలుగు గంటలుగా బాధితులు హైవేపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఆందోళన కారణంగా హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రక్రియను చేపట్టారు.

