కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 10వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం ఉదయం కరీంనగర్లోని గాయత్రీనగర్లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లతోపాటు జిల్లాలోని పార్టీ నాయకులంతా భారీ ఎత్తున తరలి వచ్చారు. భూమి పూజ నిర్వహించిన అనంతరం బండి సంజయ్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి బ్యాంకెట్ హాలులో జిల్లా, మండల అధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా నుండి “వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దాం. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్ మైదానానికి తరలిద్దాం. బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలి. ప్రతి ఒక్కరూ మోడీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్ రైటింగ్ రాయించండి. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలి. మోడీ సభ సక్సెస్ తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదాం ” అని పిలుపునిచ్చారు.
జ్యోతినగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
కరీంనగర్లోని జ్యోతినగర్ కేడీఆర్ పార్కు వద్దకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి రూ.16 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేడీఆర్ పార్కు రెండో గేటు వద్ద సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
Read Also: ORR ప్రయాణికులకు CP హెచ్చరిక : అలా చేస్తే భారీ జరిమానా!
Follow Us On : WhatsApp

