కలం, మెదక్ బ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు అత్యంత బలమైన ఆయుధమని, దేశ భవిష్యత్తును, సముచిత నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు కీలకపాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జేపీ కాలనీలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీయువకులు ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా సవరణలు, తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవడానికి ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

