కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లాలోని చెట్ల చెన్నారం (Chetla Chennaram) గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారు స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం పరిమాణం, మిల్లులకు తరలింపు, నిల్వ వివరాలపై అధికారులను ఆరా తీశారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీల సంఖ్య పెంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలలో వెంటనే డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, వచ్చే 10 రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంలో ప్రభుత్వాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

