కలం, వెబ్ డెస్క్: ఏడాది పాలనలో మంత్రిగా తాను సాధించిన అతిపెద్ద విజయం “గిగ్ కార్మికుల” చట్టాన్ని తీసుకురావడమేనని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించినప్పుడు తొలుత ఇన్ని సమస్యలు ఉన్నాయనే విషయం తమకు పూర్తిగా తెలియదని చెప్పారు. పూర్తిగా విశ్లేషిస్తే గిగ్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అర్థమైందని.. తాము చిత్తశుద్ధితో శ్రమించి ఈ చట్టాన్ని సాధించామని అన్నారు. భవిష్యత్తులో ఈ చట్టాన్ని మరింత బలంగా మార్చి, అవసరమైన సవరణలతో దీనిని ఒక సమగ్ర రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచలేదు..
గత పది ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేసిందని మంత్రి దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. కోట్ల నిధులను వృథా చేసి, మిషన్ భగీరథ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తాను ఇంచార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మెదక్ జిల్లాలో గాని, తమ సొంత జిల్లా అయినటువంటి మంచిర్యాలలో గాని మిషన్ భగీరథ పథకం ముమ్మాటికి విఫలం అయినట్లు కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నమ్మకంతో తనకొక కేబినెట్ లో పనిచేసే అవకాశం కల్పించారని.. ఈ బాధ్యత ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

