కలం, భువనగిరి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో నడుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (BJP Chief Ramchander Rao) తీవ్రంగా విమర్శించారు. యాదాద్రిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టు పేరుతో సాగుతున్న ‘గాంధీ సారోవర్ ప్రాజెక్టు’ రూపకల్పనను మాత్రమే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో రైతుల సమస్యలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రామచందర్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించదని, రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులను కేంద్రమే రియింబర్స్మెంట్ రూపంలో ఇస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం సేకరించిన మొత్తం ధాన్యంలో దాదాపు 50 శాతం కేవలం తెలంగాణ నుంచే కొనుగోలు చేశామని ఆయన (BJP Chief Ramchander Rao) గణాంకాలతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస అవగాహన లేకపోవడం వల్లే ఈ ఏడాది ధాన్యం దిగుబడిని సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, కేంద్రానికి ధాన్యం సేకరణపై సరైన ఇండెంట్ కూడా సమర్పించలేదని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి నేతలపై ఇష్టమొచ్చినట్లు, ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బిజెపి తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో తిరగలేరని బిజెపి చీఫ్ హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు మాట తప్పుతోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ను కాపాడేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రామ చందర్ రావు ఆరోపించారు.

