కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి నది వరదల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల (Minister Tummala) అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్లతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో వరదల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, ఈ ఏడాది నుంచి మండల స్థాయిలో కూడా ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, వరద ప్రభావిత ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు, వైద్యం, త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు. అవసరమైన ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేసి, రెవెన్యూ, రెస్క్యూ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపడతామని తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నష్టం తగ్గించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నందున పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని, వైద్యశాఖ అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
భద్రాచలం పట్టణంలో గోదావరి నీరు చేరకుండా, వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
వనమహోత్సవంలో భాగంగా జాతీయ రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, పుష్కరాల ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే సారపాక జాతీయ రహదారిపై ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో రహదారి ఎత్తు పెంచే చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శేష్ట, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Also: సోషల్ మీడియాలో ‘ఇడుపు కాయితం’ వార్!
Follow Us On: Sharechat

