కలం, వెబ్ డెస్క్ : మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్ పాస్బుక్స్ మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కలలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార పరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి (Seethakka) మాట్లాడుతూ.. మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు. “ఈ రోజు ప్రారంభిస్తున్నది ఒక సాధారణ కార్యక్రమం కాదు.. తెలంగాణ గ్రామీణ మహిళల భవిష్యత్తును మార్చే ఒక ఆర్థిక ఉద్యమం” అని సీతక్క స్పష్టం చేశారు. BITS పిలానీ, T-Hub భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రతి ఇంక్యుబేటర్కు రూ.10.70 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
ఈ కేంద్రాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ట్రైనింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, డిజిటల్ సపోర్ట్, ఫైనాన్షియల్ గైడెన్స్, బిజినెస్ మెంటారింగ్ వంటి సేవలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో SERP సీఈఓ దివ్య దేవరాజన్, T-Hub సీఈఓ కవికృత్, వి-హబ్ సీఈఓ సీత పల్లచోల, SERP నాన్ఫామ్ డైరెక్టర్ జాన్సన్, DRDO ప్రతినిధులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: బడి బస్సు పదిలమేనా..?
Follow Us On : WhatsApp

