కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కట్టిన ఇళ్ల కంటే, తాము ఐదేళ్లలోనే ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, గత ప్రభుత్వం కనీసం 10 వేల గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గం హుస్నాబాద్లో (Husnabad) గత పదేళ్లలో కేవలం 280 ఇళ్లు నిర్మిస్తే, తాము ఏడాది కాలంలోనే 3500 ఇళ్లను పూర్తి చేశామని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు.
హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా నగర సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ సొంత స్థలాలు ఉన్న పేదలు తక్కువగా ఉన్నందున ప్రభుత్వ స్థలాలను అన్వేషిస్తున్నామని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 40 ప్రభుత్వ స్థలాలను గుర్తించామని, ఇవి వెయ్యి గజాల నుండి 25 ఎకరాల వరకు ఉన్నాయని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పలుమార్లు సమీక్షలు నిర్వహించామని, 10 వేల గ్రామాల్లో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపించినా తాము ఏ నిర్ణయానికైనా సిద్ధమని కేటీఆర్కు సవాల్ విసిరారు.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Read Also: డిజిటల్ విప్లవం

