కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా గ్రానైట్ పరిశ్రమల్లో జీఎస్టీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ స్లాబ్లను అక్రమంగా తరలిస్తూ, భారీగా పన్ను ఎగవేస్తున్న ఒక నెట్వర్క్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు బట్టబయలు చేశారు. ఈ భారీ స్కామ్కు సంబంధించి ఆసిఫ్ నగర్కు చెందిన శ్రీకాంత్ దాసరి అనే వ్యక్తిని అధికారులు ఈ నెల 21న అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్న గ్రానైట్పై నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 18 శాతం జీఎస్టీని పూర్తిగా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం శ్రీకాంత్ నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ వే-బిల్లులను పెద్ద ఎత్తున వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో శ్రీకాంత్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్ నాంపల్లిలోని ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు.
జీఎస్టీ సొమ్ము ఎక్కడికి మళ్లించారు..?
DGGI అధికారులు శ్రీకాంత్ అరెస్టుతోనే ఈ వ్యవహారం ముగిసిపోలేదని అనుమానిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన రూ.16 కోట్ల జీఎస్టీ సొమ్మును ఎక్కడికి దారి మళ్లించారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో DGGI లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ DGGI ప్రత్యేక అధికారుల బృందం కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని పలు గ్రానైట్ సంస్థల్లో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Read Also: తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ
Read Also: డిజిటల్ విప్లవం

