కలం, యాదగిరిగుట్ట : కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయాలని ప్రజా పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాదగిరిగుట్ట (Yadagirigutta) లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య (Karre Venkataiah) పాల్గొని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) పై నిప్పులు చెరిగారు.
హరీష్ రావును విమర్శించే స్థాయి ఐలయ్యకు లేదని, వెంటనే ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్రె వెంకటయ్య మాట్లాడుతూ.. “బీర్ల ఐలయ్య సర్పంచ్ కాకముందు ఆయన ఆర్థిక, సామాజిక స్థాయి ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అధికారం చేతిలో ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. స్పెక్ట్రా కంపెనీ ద్వారా అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించింది వాస్తవం కాదా?” అని ప్రశ్నించారు.
సొంతంగా పాల డెయిరీ పెట్టి వ్యాపారం చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలు తెలంగాణలో ఏరులై పారుతుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ సంఘం భవనాన్ని ఆంధ్ర వ్యాపారులకు కట్టబెట్టిన విషయం వాస్తవం కాదా? దమ్ముంటే యాదగిరిగుట్ట పాదాల వద్ద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు.
చల్లూరు గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, ఆలేరు నియోజకవర్గంలో గుట్టలు, చెరువుల మట్టిని తోడేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. గత మూడేళ్ల కాలంలో ఆలేరు నియోజకవర్గాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
“పెద్ద పెద్ద నాయకులను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటే సహించే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీర్ల ఐలయ్య అవినీతి మొత్తాన్ని బయటపెట్టి, జైలుకు పంపడం ఖాయం. ఇకపై ఆలేరు నియోజకవర్గంలో ఆయనను తిరగనివ్వం.” అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, బాహుపేట సర్పంచ్ కావిడి మహేందర్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీష్, సారాశి రాజేష్ యాదవ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

