కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ అద్భుతంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) కొనియాడారు. శనివారం ఆయన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ (MP Balram Naik) తో కలిసి మార్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మార్ట్లో లభించే అటవీ ఉత్పత్తులు, సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తులను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం సహాయక బృందాలలోని గిరిజన మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ చొరవతో భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేయబడిందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన అనేక అటవీ వస్తువులను భద్రగిరి మార్ట్లో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రగిరి మార్ట్లో అందుబాటులో ఉంచిన గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులకు చాలా ప్రత్యేకత ఉందన్నారు. భద్రాచలం ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఎస్హెచ్జీ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం భద్రగిరి మార్ట్ ఆవరణలో మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.

