కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ గెలవాలని.. ఆ స్పూర్తి నింపేందుకే ప్రధాని మోదీ (PM Modi) వస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) స్పష్టం చేశారు. మే 10న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కొంపల్లిలో జరిగిన మేడ్చల్ అర్బన్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తో ఈటల కలిసి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చి గెలిపించారని గుర్తు చేశారు. మోదీ మళ్ళీ ప్రధాని కావాలని ఓటు వేశారని చెప్పారు. త్వరలో వెలువడనున్న ఫలితాల్లో పశ్నిమ బెంగాల్ లో బీజేపీ గెలిచి సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 27 ఏళ్ళైనా గుజరాత్ లో మళ్లీ గెలిచిందని గుర్తు చేశారు. మల్కాజిగిరి నుండే మోదీ గత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని.. మళ్ళీ ఆయన ఇక్కడికే రాబోతున్నారని చెప్పారు. అప్పుడు చూపించిన ప్రేమ మళ్ళీ చూపించాలని స్థానిక ప్రజలను కోరారు.
లక్ష మంది తమ పార్లమెంట్ నుండి హాజరవుతారని మాట ఇచ్చానని.. పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఈటల విజ్ఞప్తి చేశారు. రేపటి బహిరంగ సభ ప్రధాని మోదీకి కూడా స్ఫూర్తిని, భరోసాను ఇవ్వాలని ఈటల ఆకాంక్షించారు. బెంగాల్ తరువాత తెలంగాణనేనని.. ఈ గడ్డమీద కాషాయ జెండా ఎగరవేయడం మనందరి ఆశయమని పేర్కొన్నారు. మోదీ స్పూర్తితో మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరాలని.. పార్టీ బలంగా ఉంటే డబ్బుతో పనిలేదని అన్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డా. ఎస్. మల్లారెడ్డి, జిల్లా ఇంచార్జీ మహేంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్, విగ్నేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పా రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధా పటేల్, తదితరులు హాజరయ్యారు.

