కలం, ఖమ్మం బ్యూరో : యాసంగి ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో (Chegomma) గోదామును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి, వారికి త్వరితగతిన చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. అలాగే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.12,000 అందిస్తున్నామని తెలిపారు.
గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, అందుకే దానిని రద్దు చేసి భూ భారతి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేశామని గుర్తుచేశారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఈ ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి (Minister Ponguleti) తెలిపారు. ఈ సందర్భంగా 191 మంది లబ్ధిదారులకు రూ.58.58 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇకపై బండి సీజ్ చేయడం కుదరదు!
Follow Us On: Instagram

