కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివార్లలోని పసుమాములలో ఒక ఘోర హత్యోదంతం (Pasumamula Murder Case) వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి నివసిస్తున్న నిషాని సుహాస్ (22) అనే యువకుడు తన స్నేహితుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. తన వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో, సుహాస్ తన స్నేహితులైన రాకేశ్, పరశురాం, రాజుల ఫోన్లను వాడుతుండేవాడు. ఈ క్రమంలోనే, తన స్నేహితుడి లవర్కు ఇన్స్టాగ్రామ్ ద్వారా సుహాస్ అసభ్యకరమైన మెసేజ్లు పంపడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన ప్రియుడికి చెప్పడంతో, సుహాస్పై వారు పగ పెంచుకున్నారు.
సుహాస్ను హతమార్చాలని నిర్ణయించుకున్న స్నేహితులు, గతంలో గంజాయి వ్యాపారంలో ఉన్న పాత లావాదేవీల వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి గొడవకు దిగారు. ఈ అంశంపై మాట్లాడుకుందామని నమ్మించి, సుహాస్ను ఊరి శివారులోని ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రాకేష్, పరుశురాం, రాజుతో పాటు మరో వ్యక్తి కలిసి సుహాస్పై విచక్షణారహితంగా దాడి చేశారు.
అతని మర్మాంగాలు నలిపేసి, ప్రాణాలు పోయేంత వరకు ఘోరంగా కొట్టారు. సుహాస్ చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక, మృతదేహాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. కొడుకు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన సుహాస్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

