కలం, వెబ్ డెస్క్ : అర్హులైన జర్నలిస్టుల (Telangana Journalists) ఇళ్ల స్థలాల అంశంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 2 వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు శుభవార్త చెప్తామని వెల్లడించారు. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లోని తన సమావేశ మందిరంలో 4 సొసైటీల ప్రతినిధులతో మంత్రి భేటి అయ్యారు. అంతకు ముందు జూబ్లిహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాలపై చర్చించి మంత్రి నేరుగా సచివాలయం చేరుకున్నారు. ఈ సమావేశంలో మీడియా అకాడెమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) కంటే ముందు నాలుగు సొసైటీల ప్రతినిధులతో తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్, సమాచార శాఖ కమీషనర్ సమాలోచనలు జరిపారు. ఇండ్ల స్థలాలపై వివిధ సొసైటీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నారు. రాజధాని హైదరాబాద్ కు కొంత దూరంలో ఉన్న ప్రాంతాలు (ఫోర్త్ సిటీ) ఐతే 300 ల గజాల స్థలం, నగరానికి దగ్గరపట్ల ఉన్న ప్రాంతాలలో ఐతే 1600 ల చదరపు అడుగుల ఫ్లాట్ ఇచ్చే విధంగా ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఓకే చోట పెద్ద మొత్తంలో స్థలం అందుబాటులో లేకుంటే హైదరాబాద్ శివారుల్లో నలువైపులా స్థలాలు ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. మీటింగ్ కు హాజరైన సొసైటీ ప్రతినిధుల మనోగతాన్ని నమోదు చేసిన సమాచార కమీషనర్ ముకుంద రెడ్డి ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించారు.
జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, చిరకాలంగా పీటముడి పడి ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఆ దిశలో వడివడిగా అడుగులు వేసి జూన్ 2 వ తేదీ కల్లా సమస్యను ఒక కొలిక్కి తెస్తామని ప్రకటించారు. సభ్యుల సంఖ్య 9 కి మించకుండా సొసైటీల నిర్వాహకులతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇవాళ్టి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని రూపొందించి తనకు అందించాలన్నారు. ఆ ప్రతిని తాను స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన వనరుల సమీకరణ ఉప సంఘానికి అందజేస్తానని చెప్పారు. సబ్ కమిటీ ఆమోదముద్ర వేసిన తరువాత అందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్దామనీ, స్థలాల కేటాయింపు ఫైల్ పై ఆయనతో సంతకం చేయించి ప్రక్రియను ముగిద్దామని తెలిపారు.
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ప్రతినిధులతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, గత ప్రభుత్వం ఆ సొసైటీకి కేటాయించిన భూములు రద్దైపోయినట్లే అని తేల్చి చెప్పారు. జేఎన్జే సభ్యులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో తమ దగ్గరకు రావాలని మంత్రి వాళ్లకు సూచించారు. నిజాంపేట్, పెట్ బషీరాబాద్ లలో కనీసం ఒక్క స్థలాన్ని ఐనా తమకు ఇవ్వాలని జేఎన్జే ప్రతినిధులలో ఒకరు మంత్రిని కోరారు. అందుకు బదులుగా, “ఇది వ్యాపారం కాదనీ, బేరసారాలు కుదరవనీ, కోర్టు తీర్పు అమలే శిరోధార్యం” అని మంత్రి ఖరాఖండిగా చెప్పారు. ఆ తరువాత సచివాలయంలోనే హుటాహుటిన సమావేశమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, జేఎన్జే సొసైటీ జనరల్ బాడీ భేటీ నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. సమావేశంలో సభ్యుల ఏకాభిప్రాయం సాధించి త్వరలోనే మంత్రికి నివేదించనున్నారు.
ఇదిలా ఉంటే, యుధ్దప్రాతిపదికన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు తానూ, సమాచార కమీషనర్ ఇద్దరం నిరంతరం జేఏసీ సభ్యులకు అందుబాటులో ఉంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ మీటింగ్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల ముఖ్య అధికారి గుర్రం మల్సూర్ కూడా పాల్గొన్నారు.
Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్ కల్చర్..!
Follow Us On: X(Twitter)

