కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తెలిపారు. గురువారం కనగల్ (Kanagal) మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువు ద్వారానే కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని కోరారు. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు” నిర్మిస్తున్నట్లు తెలిపారు. కనగల్లో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లగొండలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించామని, నర్సింగ్ కళాశాల పనులు డిసెంబర్లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోందని, మహిళలకు కూడా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సెట్విన్ ద్వారా 2500 మంది మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదనంగా రూ.80 కోట్లతో ఏటీసీ కేంద్రం నిర్మించామని, వీటి ద్వారా యువత స్వయం ఉపాధి పొందే అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు. తమ స్వంత నిధులతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జూనియర్ కళాశాల నిర్మాణం చేపట్టిన విషయాన్ని కూడా ఆయన (Minister Komatireddy) గుర్తు చేశారు.
Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!
Follow Us On : WhatsApp

