యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రబీ ధాన్యం సేకరణను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అధికారులను ఆదేశించారు. నల్గొండలోని ఆర్‌ అండ్ బీ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం సేకరణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో లారీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మేర లారీల సంఖ్యను తక్షణమే పెంచాలని సూచించారు.

ధాన్యం తరలింపులో జాప్యం జరగొద్దు

ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి, అక్కడికి అదనపు వాహనాలను పంపాలన్నారు. మిల్లులకు ధాన్యం తరలింపులో (Paddy Procurement) ఎలాంటి జాప్యం జరగొద్దని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతుల సౌకర్యార్థం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పగలు, రాత్రి కొనుగోలు ప్రక్రియ సాగేలా కేంద్రాల వద్ద లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే రైతులు, కేంద్రాల నిర్వాహకుల కోసం తాగునీరు, నీడ (చలువ పందిళ్లు) కచ్చితంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతులు రోడ్లపై ధాన్యం పోయాల్సిన అవసరం లేకుండా, అవసరమైతే సమీపంలోని పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్‌లో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఈ సీజన్‌లో సుమారు 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. పెరిగిన దిగుబడికి అనుగుణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>