కలం, వెబ్డెస్క్: ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా కెనడా (Canada) లో భారత సంతతి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం భారత ప్రభుత్వం స్పందించింది. అతడి మరణానికి కెనడాదే బాధ్యత అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మృతుడికి కెనడా పౌరసత్వం ఉందన్నారు. కాగా, కెనడాలోని ఎడ్మంటన్ సిటీలో ప్రశాంత్ శ్రీకుమార్ తన కుటుంబంతో కలసి నివసించేవారు. ఈ నెల 22న ఆఫీసులో పనిచేస్తుండగా ప్రశాంత్కు ఛాతీలో నొప్పి ప్రారంభమైంది. వెంటనే అతడిని సహోద్యోగి దగ్గరలోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ దాదాపు 8 గంటల సేపు వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. అనంతరం ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్గా ఉందంటూ, నొప్పి నివారణకు మందు ఇచ్చి సరిపెట్టారు. సమాచారం అందడంతో ఆస్పత్రికి తండ్రి రాగా, తనకు నొప్పి తీవ్రంగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ఆ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తండ్రి తీసుకెళ్లాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ప్రశాంత్ నొప్పితో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంతానే తన భర్త మరణించాడని ప్రశాంత్ భార్య నిహారిక వాపోయారు. ఈ విషయం సంచలనం సృష్టించడంతో భారత్ స్పందించింది. ప్రశాంత్ మరణానికి కెనడా(Canada) దే బాధ్యతని పేర్కొంది.
అమెరికా దృష్టికి హెచ్1బీ అంశం:
హెచ్1బీ (H1B Visa) వీసాల జారీలో ఆలస్యం, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల రద్దుపై భారత ఆందోళనలను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు రణధీర్ జైస్వాల్ చెప్పారు. వీసా సమస్యలపై భారత టెకీలు, వారి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్లో ఇబ్బందులు తెలెత్తుతున్న విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ అంశంపై అమెరికాదే పూర్తి అధికారం అయినప్పటికీ భారత ఆందోళనలను పరిశీలించమని చెప్పినట్లు జైస్వాల్ పేర్కొన్నారు.
Read Also: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన భారత్
Follow Us On: X(Twitter)


