కలం, ఖమ్మం బ్యూరో: ఎర్రని సూర్యకిరణాలను పోలిన ఆకారం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అతిథి. ప్రకృతి చేసే అద్భుతం. అదే మే పుష్పం (May Flower). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులోని (Manuguru) శ్రీశ్రీనగర్ ఇప్పుడు ఈ అద్భుత పుష్పానికి వేదికైంది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలోని సింగరేణి విశ్రాంత ఉద్యోగి కురి రాజేశ్వరరావు గత 30 ఏళ్లుగా ఈ మొక్కలను పెంచుతున్నారు. ‘ఈ మొక్కలు నా కుటుంబంలో భాగమయ్యాయి. ఏటా మే నెల రాగానే ఆ ఎర్రని పుష్పం కోసం ఎదురుచూస్తాను. సువాసనలు వెదజల్లుతూ, అది వికసించగానే కలిగే ఆనందం వర్ణనాతీతం” అని రాజేశ్వరరావు మురిసిపోతున్నారు.
ఈ మే పుష్పం ప్రత్యేకతలు గమనిస్తే మొక్క కింది భాగంలో పదునైన కత్తుల్లాంటి ఆకులు ఉంటాయి. వాటి మధ్య నుంచి ఒకే ఒక పుష్ప కాండంపైకి వస్తుంది. ఆ కాండంపై అనేకమైన ఎర్రని కాంతులతో గుండ్రటి ఆకారంలో ఈ పుష్పం విరబూస్తుంది. చూస్తుంటే ఒక ఎర్రని కాంతి పుంజంలా భ్రమ కలిగిస్తుంది. ఏడాదంతా నిశ్శబ్దంగా ఉండే ఈ మొక్క, ఒక్క మే నెలలో మాత్రమే పుష్పిస్తుంది. ఐదు రోజులపాటు కనువిందు చేసి, ఆపై ప్రకృతిలో కలిసిపోతుంది. కాంక్రీట్ వనాల మధ్య కూడా దశాబ్దాల నుంచి రాజేశ్వరరావు ఈ రకమైన మొక్కలను పెంచుతున్నాడు. ప్రస్తుతం ఈ పుష్పాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.

