కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్, కామారెడ్డి లతో కూడిన ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తదితరులు పాల్గొని జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు.
వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. సుమారు రెండు వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరి కొందరికి అప్రెంటిస్ షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారని అన్నారు. ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందుకు గాను స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్ఓ పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ-డీఎం కార్తీక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

