కలం, ఖమ్మం: జాతీయ రహదారులపై ప్రైవేట్ నెట్వర్క్ సంస్థల కేబుల్ పనులు వాహనదారులకు సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా పాల్వంచ (Palvancha) పట్టణంలో జాతీయ ప్రధాన రహదారి (National Highway) పై తవ్విన భారీ గుంత (Cable Trench) ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. పని పూర్తయిన తర్వాత గుంతను పూడ్చకుండా వదిలేసినందుకు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు గుంత సరిగ్గా కనిపించకపోవడంతో, వాహనాలు స్కిడ్ అయ్యి కింద పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ఇది దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన మార్గం. ఈ నెల 26న జరగబోయే శ్రీరామనవమి వేడుకల సమయంలో వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వాహనాల ద్వారా ఈ రోడ్డు నుండే భద్రాద్రికి చేరుకుంటారు. ఇంతటి కీలక సమయంలో రోడ్డుపై ఇలాంటి ప్రమాదకర గుంతలు ఉండటం భక్తుల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
జాతీయ రహదారిపై పనులు చేపట్టాలంటే ఆర్ & బి అధికారులు నుండి ముందస్తు అనుమతులు అవసరం. అసలు ఈ నెట్వర్క్ సంస్థకు అనుమతులు ఉన్నాయా ? లేదా ? అనేది అనుమానంగా మారింది. ఈ సమస్యపై పర్యవేక్షించాల్సిన ఆర్ & బి అధికారులు ఏమాత్రం పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి.. ఈ గుంతను పూడ్పించి ప్రమాదాలను నివారించాలనీ స్థానికులు, పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన
Follow Us On: Instagram

