కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం ప్రాంగణంలోని ఉప ఆలయాలైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ గణపతి, అమ్మవారి ఆలయాల్లో ఈ నెల 2న జరిగిన చోరీ ఘటనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) శనివారం ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. చోరీ జరిగిన ప్రాంతంతో పాటు దుండగులు ధ్వంసం చేసిన ఆలయ తలుపులను పరిశీలించారు. పూజారులు, ఆలయ నిర్వాహకులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రమైన హరిహర క్షేత్రంలో చోరీ జరగడం విచారకరమన్నారు. పోలీసులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ పాల్గొన్నారు.

