కలం, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) మరోసారి కేకేఆర్పై (KKR) విమర్శలు గుప్పించారు. రహానే లాంటి ఆటగాళ్లు కేవలం కెప్టెన్లు కావడం వల్లే ఇంకా ఆడుతున్నారంటూ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కేకేఆర్ పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఈ మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరగబోయే కీలక పోరుకు ముందు జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆయన సూచించారు.
ఈ సీజన్లో కెప్టెన్ అజింక్య రహానేకు ఏదీ కలిసి రావడం లేదు. గాయాల సమస్యలు, ఆటగాళ్ల పేలవ ఫామ్, సొంత ప్రదర్శనపై వస్తున్న విమర్శలతో ఆయన సతమతమవుతున్నారు. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ముకుల్ చౌదరి అద్భుత ఆట తీరు వల్ల కేకేఆర్ విజయాన్ని కోల్పోయింది. అయితే, ఈ ఓటమి కంటే జట్టు వాతావరణంపైనే మనోజ్ తివారీ (Manoj Tiwary) ఆందోళన వ్యక్తం చేశారు.
కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ అందుబాటు గురించి రహానే ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలని మొండిగా సమాధానం ఇచ్చారు. కెప్టెన్ చేసిన ఈ వ్యాఖ్యలు జట్టులో వాతావరణం సరిగ్గా లేదని సూచిస్తున్నాయని తివారీ పేర్కొన్నారు. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కెమెరూన్ గ్రీన్, లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేదని ఆయన విమర్శించారు. గ్రీన్ తన రెండు ఓవర్లలో రిషబ్ పంత్ వికెట్ తీసినప్పటికీ, 28 పరుగులు సమర్పించుకోవడంపై తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రీన్ ప్రస్తుత ఫామ్ అంతంత మాత్రంగానే ఉందని, కేవలం అతని పేరును చూసి లేదా భారీ ధర చెల్లించామన్న కారణంతో అతన్ని తుది జట్టులో ఆడించాల్సిన అవసరం లేదని తివారీ సూచించారు. గ్రీన్ స్థానంలో రింకూ సింగ్ లేదా రమణ్దీప్ సింగ్ వంటి ప్రతిభావంతులైన భారతీయ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన కేకేఆర్ యాజమాన్యాన్ని కోరారు. చెన్నై స్టేడియంలో గ్రీన్కు మంచి రికార్డు కూడా లేదని ఆయన గుర్తు చేశారు.
Read Also: తేనె పవర్ అంతా ఇంతా కాదు.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
Follow Us On: X(Twitter)

