కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) మధ్య విభేదాలు మరింత ముదిరాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాగూర్ (Manickam Tagore) కౌంటర్ ఇచ్చారు. “కష్టకాలంలో డీఎంకేతో కాంగ్రెస్ నిలబడ్డది. వారికి మైనారిటీ వచ్చినప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఉదయనిధి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావు” అని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేను కలపాలని బీజేపీ ప్రయత్నం చేసిందని.. ఆ కుట్రలను అడ్డుకొనేందుకే తాము టీవీకేకు మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
బీజేపీని అడ్డుకొనేందుకే ..
బీజేపీని తమిళనాడులో అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే తాము టీవీకేకు మద్దతు ఇచ్చామన్నారు. “కాంగ్రెస్ ఎప్పుడూ లౌకిక కూటమికే కట్టుబడి ఉంటుంది. కానీ డీఎంకే-ఏఐఏడీఎంకే మధ్య బీజేపీ మధ్యవర్తిత్వం చేస్తోందన్న సమాచారం వచ్చింది. బీజేపీతో ఏ అవగాహననైనా కాంగ్రెస్ సహించదు” అని స్పష్టం చేశారు. తమిళ రాజకీయాల్లో ఒకే సిద్ధాంతం నుంచి పుట్టినప్పటికీ తీవ్ర ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య అసాధారణ పొత్తుపై చర్చలు జరుగుతున్నాయనే సంకేతాలను ఠాగూర్ (Manickam Tagore) ప్రస్తావించారు.
డీఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు
ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “డీఎంకే కార్యకర్తల వల్లే కాంగ్రెస్కు ఐదు స్థానాలు వచ్చాయి. ప్రజలు ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కు ఓటేశారు. కానీ కొన్ని పదవుల కోసం వారు మమ్మల్ని సమాచారం ఇవ్వకుండానే విడిచిపెట్టారు. ఇకపై కాంగ్రెస్ను మన దగ్గరకు రానివ్వకూడదు” అని మండిపడ్డారు.
డీఎంకే, కాంగ్రెస్ కూటమి వరస విజయాలు
డీఎంకే-కాంగ్రెస్ పొత్తు గతంలో వరుస విజయాలు సాధించింది. 2019, 2024 లోక్సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 234 స్థానాల అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 స్థానాలు అవసరమైన సమయంలో కాంగ్రెస్ తన ఐదు స్థానాలను విజయ్కు మద్దతుగా ఇచ్చింది. ఇప్పటికే విజయ్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్లోని కొంతమంది నేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
పడిపోయిన డీఎంకే కూటమి బలం
అంతేకాకుండా డీఎంకే మిత్రపక్షాలైన వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విడదలై చిరుతైగళ్ కచ్చి (VCK) కూడా ఎనిమిది స్థానాలతో టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో డీఎంకే కూటమి బలం 73 నుంచి 60కి పడిపోయింది. ఇదే సమయంలో ఏఐఏడీఎంకేలోనూ అంతర్గత విభేదాలు చెలరేగి 25 మంది సభ్యులు విజయ్ శిబిరానికి మద్దతు ఇచ్చారు. చివరకు గవర్నర్ ఆర్వీ అర్లేకర్ సమక్షంలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. విశ్వాస పరీక్షలో 144 ఓట్లతో టీవీకే ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది.
Read Also: మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

