కలం, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా దేశంలోని కోర్టులు, స్కూళ్లు, ఎయిర్ పోర్ట్లకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తరచూ ఫేక్ బాంబు బెదిరింపులు (Fake Bomb Threat) రావడం, పోలీసులు, అధికారుల సమయం వృథా కావడం జరుగుతూనే ఉంది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తాజాగా ఢిల్లీ (Delhi)లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టులు, ప్రముఖ సంస్థలకు 1,000కి పైగా ఫేక్ బెదిరింపు మెయిల్స్ పంపిన శ్రీనివాస్ లూయిస్ అనే 47 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూరులో అద్దెకు ఉంటున్న ఇతడిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఈ బెదిరింపులన్నీ ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, అతను అస్థిరంగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ రోజు నిందితుడిని ఢిల్లీకి తరలించి, అసలు ఇలాంటి పనులకు పాల్పడటానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.

