కలం, కరీంనగర్ బ్యూరో: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన కేసులో నిందితుడిని వీణవంక (Veenavanka) పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చల్లూరు గ్రామానికి చెందిన వేముల పద్మ (45), భర్త వైకుంఠం, ఈ నెల 6వ తేదీ (06-07-2026) సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆమె మెడ పట్టుకుని బలవంతంగా బంగారు పుస్తెల తాడును గుంజేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆమె ముఖం, కడుపుపై దాడి చేసి గాయపరిచాడు. ఆమె పెట్టిన కేకలు విని సమీపంలోనే ఉన్న ఆమె కుమార్తె శాముల నవ్యశ్రీ (24), మరియు మరిది శాముల సంపత్ (38) లు వెంటనే అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. కుటుంబ సభ్యులు రావడం గమనించిన నిందితుడు భయపడి, తను తెచ్చుకున్న సైకిల్ మరియు సెల్ఫోన్ను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి పరారయ్యాడు.
పోలీసుల చాకచక్యం – నిందితుడి అరెస్ట్:
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వీణవంక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ ఆధారంగా నిందితుడిని పిల్లి సదయ్య (45), s/o కొమురయ్య, గ్రామం: ఎల్బాక (ఘనముక్ల), మండలం: వీణవంకగా గుర్తించారు. నిందితుడిని మంగళవారం చాకచక్యంగా పట్టుకుని, అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.

