కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా భిక్కనూరు శివారులో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా (Ganesh Gupta)కు తృటిలో ప్రమాదం తప్పింది. గణేష్ గుప్తా ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొట్టడంతో కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గణేష్ గుప్తాకు గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మోర్తాడ్ లో జరిగే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు గణేష్ గుప్తా హైదారాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్యామేజ్ కావడంతో పాటు ప్రమాదం నేపథ్యంలో గణేష్ గుప్తా తిరిగి హైదారాబాద్ వెనుతిరిగారు. అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు బంధువులు ఘటన గురించి తెలిసి షాక్ కు గురై ప్రమాదంపై ఆరా తీశారు. గణేష్ గుప్తాకు ఫోన్లు చేసి మాట్లాడారు.

