కలం, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్లో (Union Cabinet) త్వరలోనే భారీ మార్పులు జరగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో 72 మంది మంత్రులు ఉండగా.. రాజ్యాంగం ప్రకారం 81 మందికి అవకాశం ఉంటుంది. కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటు ఉన్నవారిలో కొందరి శాఖలు మార్చాలని చూస్తున్నారు. ఈ మేరకు మోదీ, అమిత్ షా, ఇతర అగ్ర నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్సెస్ కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం అయినట్లు చెబుతున్నారు.
కేబినెట్లోకి నితిన్ నభిన్, నితీశ్ కుమార్..?
ఇటీవలే బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నభిన్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో, బిహార్ సీఎంగా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్కు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఈ నెల 18 వరకు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. తిరిగి దిల్లీకి వచ్చాకే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

