కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్పై (PC Ghose Commission) హైకోర్టు ఇచ్చిన తీర్పు క్లీన్ చిట్ కాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. ఈ విషయం పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తేలిందని, విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిందని గుర్తు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైతం ఈ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అవినీతిపై విచారణ కొనసాగుతోందని.. హైకోర్టు తీర్పు విచారణ ప్రక్రియకు అడ్డుకాదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఘోష్ కమిషన్ వేసిందని గుర్తు చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఏ ఉపయోగం లేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విధానంలో ఎంక్వైరీ
తాము ప్రజాస్వామ్య పద్ధతిలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతిపై విచారణ కొనసాగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడుతోందన్న విమర్శలను కొట్టిపారేశారు. తాము సీబీఐ ఎంక్వైరీ చేయాలని లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో జరిగిన అవకతకవకలపై కఠినంగా వ్యవహరిస్తమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకో రెండున్నర ఏండ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి.. తాము అన్ని ఆరోపణలపై విచారణ చేస్తామని ఆయన (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, ఈ కారు రేసు, కాళేశ్వరం అవినీతి దేన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బీజేపీ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే
Follow Us On: Instagram

