కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా హన్వాడ మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సి.చరణ్ కుమార్ (473 మార్కులు), డి.విజయలక్ష్మి (468 మార్కులు), డి.రాకేష్ (452 మార్కులు), ఎన్.అక్షయ (443 మార్కులు), పి.కార్తిక్ (431 మార్కులు) అభినందనలు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Yennam) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సరైన దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఉపాధ్యాయులు వెనుకబడిన, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్, ఉపాధ్యాయులు సాయినాథ్, శ్రీనాథ్, వెంకటేష్, షాబుద్దీన్, కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: రైల్ రోకో కేసులో కవితకు సమన్లు!
Follow Us On: Sharechat

