కలం, వెబ్ డెస్క్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కనికరించి భిక్షం వేసిన పాపానికి ఓ షాపు యజమాని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కేవలం ఐదు రూపాయలే ఇచ్చాడన్న కోపంతో ఒక యాచకుడు ఏకంగా షాపు యజమానిపైనే హత్యాయత్నానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక వ్యాపారి శ్రీనివాస్ తన షాపు వద్ద ఉన్న సమయంలో ఒక యాచకుడు వచ్చి ధర్మం చేయాలని అడిగాడు. దీనితో శ్రీనివాస్ మానవత్వంతో ఐదు రూపాయల నాణేన్ని అతడికి ఇచ్చాడు. అయితే ఆ చిల్లర తక్కువైందని, తనకు మరింత డబ్బు కావాలని సదరు యాచకుడు గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన యాచకుడు, తన వద్ద ఉన్న కత్తిని తీసి ఒక్కసారిగా శ్రీనివాస్పై దాడికి పాల్పడ్డాడు.
ఊహించని ఈ పరిణామంతో శ్రీనివాస్ గాయపడగా, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని కాపాడారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు. సాయం చేయబోతే ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు స్పెషల్ సెలవులు
Follow Us On : WhatsApp

