కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంటులో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే, తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు కూడా వెళ్లనున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. కార్మికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల ద్వారా జగన్ ఆరా తీస్తున్నారని వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.
8 మంది మృతదేహాల గుర్తింపు..
స్టీల్ప్లాంట్ ప్రమాద మృతులను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. మొత్తం 8 మంది మృతదేహాలు గుర్తించగా, వాటిలో ఆరుగురి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాల తరలింపునకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

