కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (Yadadri Temple) లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్వామివారికి నిత్యం సమర్పించే నైవేద్యాలను తరలించే లిఫ్ట్ గత నెల రోజులుగా పనిచేయకపోవడంతో అర్చకులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేలాది మంది భక్తులు దర్శించుకునే ఇటువంటి ప్రముఖ క్షేత్రంలో కనీస సౌకర్యాల నిర్వహణలో లోపాలు తలెత్తడంపై స్థానికులు మండిపడుతున్నారు. స్వామివారి ప్రసాదాలను కింది నుంచి కొండ పైకి చేరవేసే లిఫ్ట్ చెడిపోవడంతో, సిబ్బంది ప్రసాదాల బరువును మోస్తూ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాల్సి వస్తోంది. ఈ వేసవి కాలంలో మండుటెండలను సైతం లెక్కచేయకుండా, భారీ బరువులతో మెట్లు ఎక్కడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. అర్చకులు పడుతున్న ఇబ్బందులను చూసి భక్తులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ సమస్య వేధిస్తున్నా, దేవస్థానం అధికారులు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక కారణాలా? లేక నిర్లక్ష్యమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నైవేద్యాల తరలింపులో జాప్యం జరిగితే.. ఆలయ దైనందిన కైంకర్యాలు, పూజా కార్యక్రమాల సమయపాలన తప్పే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చే ఇంత పెద్ద ఆలయంలో (Yadadri Temple), కనీసం నైవేద్యం తీసుకెళ్లే లిఫ్ట్ను కూడా బాగు చేయించలేకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు. మండుటెండల్లో సిబ్బంది పడుతున్న అవస్థలను గమనించైనా.. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని భక్తులు కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన లిఫ్ట్కు మరమ్మతులు చేయించి, స్వామివారి నైవేద్య కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్!
Follow Us On: X(Twitter)

